ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. సరైన సమాచారం లేకపోవడంతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ తరఫున నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హ ఓటరిని ఎస్ఐఆర్లో నమోదు చేయించేలా కృషి చేయాలని సూచించారు. పటాన్చెరు “మినీ ఇండియా”గా పేరుగాంచిన నియోజకవర్గమని, ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 12న పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు