ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ సూచించారు.భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలనికోరారు.ముఖ్యంగా వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించరాదని హెచ్చరించారు. నీటి ప్రవాహం తక్కువగా కనిపించినప్పటికీ దాని లోతు, వేగాన్ని అంచనా వేయడం కష్టమని, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు.అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ స్తంభాలు,తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లరాదని సూచించారు.జిల్లాలో ప్రమాద అంచున ఉన్న ఆనకట్టలు, వాగులు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య, విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయంగా పనిచేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్ను సంప్రదించాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికారులు జారీ చేసే సూచనలను పాటిస్తూ ప్రజలు తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు