ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఆస్పత్రి నిర్మాణం పూర్తై దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. జిల్లా నుంచే ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆస్పత్రి ప్రారంభంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని,స్థానికంగా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో బాధితులను హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో చికిత్స ఆలస్యం కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆస్పత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు, యంత్రాలు సుమారు ఆరు నెలల క్రితమే అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పటాన్చెరు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆస్పత్రినితక్షణమేప్రారంభించాలని, లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలతో పాటు రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజయ్య, పటాన్చెరు పట్టణ కార్యదర్శి బి.నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ, పి.పాండురంగారెడ్డి తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు