ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : చేసిన రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి: ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని మంగంపేట గ్రామంలో సుమారు రూ.50 లక్షల విలువైన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని గ్రామస్తులు ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రూపేరేవు లక్ష్మణరావు, పాలపు లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది గ్రామస్తులు, రాజకీయ నాయకుల సహకారంతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు.ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్కు దర్యాప్తు కోసం పత్రాలు పంపినప్పటికీ, ఇప్పటి వరకు భూమిని సర్వే చేయించకపోవడం ఆశ్చర్యకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, ఈ భూమి ఎమ్మార్వో కార్యాలయానికి సమీపంలో ఉండటంతో భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, గ్రామ ప్రజల ప్రయోజనాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసి, భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ ఆధీనంలో భద్రపరచాలని జిల్లా అధికారులను కోరారు. *
Admin
ప్రజా పిలుపు