ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సోమవారం ఆరుద్ర నక్షత్రం రావడంతో రెండో శ్రీశైలంగా పేరుగాంచిన బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ విశిష్ట సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ, తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహా రుద్రాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులందరికీ నిరంతరంగా అభిషేకాలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు.ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసిరావడం అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించి గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారని తెలిపారు. పరమశివుడికి ఈ రోజున అభిషేకం చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చినట్లు పేర్కొన్నారు.ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష సహకారం అందుతోందని, ఈ సందర్భంగా వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు అన్నదానం కోసం రూ.1 లక్ష విరాళం అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు