ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం;జాగృతి దివస్ సందర్భంగా బుధవారం ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీ మోడల్ కళాశాలలో సురక్షా తిరంగా – సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్లకు బానిస కాకూడదని, అపరిచితులు పంపే ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, క్యూ ఆర్ కోడ్లను క్లిక్ చేయవద్దని సూచించారు.ఇలాంటి చర్యల వల్ల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని వివరించారు.అలాగే ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు,పాస్వర్డ్లు ఎవరికీ చెప్పకూడదని, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. నకిలీ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, లాటరీలు,పెట్టుబడులు, గేమింగ్ రివార్డుల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ సహాయ కేంద్రానికి ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ సుధీర్ కుమార్, ఎస్సై అక్షిత, ఎస్సై కిష్టారెడ్డి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను సమర్థవంతంగా నివారించవచ్చని పోలీసులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు