ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ చిన్నారులు, మహిళల వైద్య సేవలు అందించే నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, నిర్వహణ, వైద్య సేవలపై రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని కొన్ని విభాగాల్లో పరిశుభ్రత లోపించిందని, వైద్య సేవల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.రోగుల బంధువుల కథనం ప్రకారం, ఆసుపత్రిలోని బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండటంతో రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశుభ్రత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల వద్ద ఉన్న వ్యక్తిగత దుప్పట్లు, బట్టలను ఇన్ఫెక్షన్ నివారణ చర్యల్లో భాగంగా తొలగిస్తున్నప్పటికీ, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై అదే స్థాయిలో శ్రద్ధ కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.అలాగే ఉదయం వైద్యుల రౌండ్లు ముగిసిన తర్వాత అత్యవసర పరిస్థితులు మినహా ఇతర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని కొందరు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అవసరమైన సమయంలో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.చిన్నారులు, గర్భిణులు అధిక సంఖ్యలో చికిత్స పొందే ఈ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని, బాత్రూమ్లు, వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది అందుబాటును పెంచాలని, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రోగుల కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు
Admin
ప్రజా పిలుపు