ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : :ఇంట్లో మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు గడ్డిమందు సేవించి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి అరవింద్ (26)ను గత ఆదివారం రోజున కుటుంబ సభ్యులు ఇంట్లో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్.. తన స్నేహితుని పొలానికి వెళ్లి అక్కడ గడ్డిమందు సేవించాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న అరవింద్ వరుసగా వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు.కొడుకు పరిస్థితిని చూసి అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో, తాను గడ్డిమందు తాగినట్లు అరవింద్ నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన అల్వాల్ లోని లోటస్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.మెరుగైన వైద్యం కోసం గురువారం సాయంత్రం అతడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అరవింద్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Admin
ప్రజా పిలుపు