ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కంది గ్రామంలోని సెంట్రల్ జైలును జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పరితోష్ పంకజ్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించి జైలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్తో కలిసి జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జైలులోని ఖైదీల కదలికలు, ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద పరిణామాలు గుర్తించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత, హానికరమైన వస్తువులు జైలు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.జైలు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆకస్మిక తనిఖీలు తరచుగా చేపట్టాలని, సందర్శకుల తనిఖీలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. జైలు పరిసరాల్లో 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగిస్తూ సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా పర్యవేక్షించాలని, జైలు గోడలు, ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసి సెంట్రీ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు.అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందికి క్రమం తప్పకుండా మాక్డ్రిల్స్ నిర్వహించాలని, జైలు భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.ఈ పర్యటనలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్, జైలు శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు