ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెల్లాపూర్, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే బలమైన పునాది అని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఏలియన్స్ స్పేస్ స్టేషన్ అపార్ట్మెంట్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన ర్యాలీతో పాటు ప్రచార రథాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు.ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రచార రథాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, సంక్షేమానికి ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అందుకే ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచార రథాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు