ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అశోక్ నగర్ గర్భాశయం వెలుపల పిండం పెరగడం వల్ల తీవ్ర అంతర్గత రక్తస్రావానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరిన 34 ఏళ్ల మహిళకు చందా నగర లోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు.కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసం, అస్వస్థతతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన సమయంలో ఆమె రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోగా, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించి సుదీర్ఘ పర్యవేక్షణలో ఉంచారు. చికిత్స కొనసాగిస్తున్న సమయంలో నిర్వహించిన పరీక్షల్లో గర్భాశయం వెలుపల పిండం పెరిగినట్లు, అండవాహిక పగిలిపోవడంతో కడుపులో భారీగా రక్తస్రావం జరిగినట్లు తేలింది. దీంతో వెంటనే రక్తాన్ని సమకూర్చి అత్యవసర శస్త్రచికిత్స చేపట్టారు.ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ భావ్య నేతృత్వంలోని వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించి పగిలిపోయిన కుడి అండవాహికను తొలగించారు. కడుపులో పేరుకుపోయిన సుమారు ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల రక్తాన్ని తొలగించి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. అనంతరం డాక్టర్ రాజు ఆధ్వర్యంలో అత్యవసర చికిత్స విభాగం వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించారు. అవసరమైన రక్తాన్ని అందించడంతో పాటు ప్రసూతి, స్త్రీరోగ విభాగం, మత్తుమందు వైద్యులు, రక్తనిధి, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో చికిత్స కొనసాగించారు.దీంతో మహిళ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గర్భాశయం వెలుపల పిండం పెరగడం మహిళల ప్రాణాలకు ముప్పు కలిగించే అత్యవసర పరిస్థితి అని తెలిపారు. నెలసరి ఆలస్యం, తీవ్రమైన కడుపు నొప్పి, తలతిరగడం, బలహీనత, రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో వ్యాధిని గుర్తించి తక్షణ చికిత్స అందించడం వల్లే ఈ మహిళ ప్రాణాలను కాపాడగలిగామని వెల్లడించారు.
Admin
ప్రజా పిలుపు