ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు పట్టణంలో ఈ ఏడాది ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను ఆగస్టు 10వ తేదీ సోమవారం ఘనంగా నిర్వహించాలని పట్టణ ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బోనాల పండుగ ఏర్పాట్లపై బుధవారం ఉదయం పటాన్చెరులోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పండుగ ఏర్పాట్లపై స్థానిక ప్రముఖులు, కుల సంఘాల ప్రతినిధులు, పురోహితులతో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని అన్ని దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపడతామని తెలిపారు. సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుత వాతావరణంలో బోనాల పండుగను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు, పురోహితులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు