ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2లో మియాపూర్ నుంచి పటాన్చెరు మీదుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలని కోరుతూ మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి శనివారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించి మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం లభించేలా కృషి చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హయాంలో మియాపూర్–పటాన్చెరు–ఇస్నాపూర్ వరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఫేజ్–2లో ఈ మార్గాన్ని ఐక్రిసాట్ వరకు మాత్రమే ప్రతిపాదించడం వల్ల పటాన్చెరు, ఇస్నాపూర్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజల రవాణా అవసరాలు పూర్తిస్థాయిలో నెరవేరే అవకాశం ఉండదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పటాన్చెరు–పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం, ఐఐటీ హైదరాబాద్, గీతం యూనివర్సిటీతో పాటు అనేక విద్యాసంస్థలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మియాపూర్–పటాన్చెరు–ఇస్నాపూర్ మెట్రో కారిడార్ అత్యవసరమని వివరించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సంగారెడ్డి, జహీరాబాద్, పొరుగు కర్ణాటక ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు.అలాగే జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గి ప్రజా రవాణా మరింత బలోపేతం అవుతుందన్నారు.ప్రజల అవసరాలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యార్థులు, ఉద్యోగుల రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మియాపూర్–పటాన్చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు మెట్రో మార్గాన్ని ఫేజ్–2లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.కార్యక్రమంలో మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక సభ్యులు రుద్రారం శంకర్, మెట్టు శ్రీధర్, సురేందర్, సాయితేజ పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు