ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు లారీ డ్రైవర్లకు సిద్ధిపేట ప్రత్యేక రెండో తరగతి న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు.సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బుధవారం ప్రత్యేక రెండో తరగతి న్యాయమూర్తి కాంతారావు ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.శిక్షపడిన వారిలో కాసార్ల మల్లేశం (తోగుట, సిద్ధిపేట జిల్లా), చుక్కల రవి (పశ్చిమ గోదావరి జిల్లా) ఉన్నారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Admin
ప్రజా పిలుపు