ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు, జూన్ 28: దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని టెలికం బోర్డు సభ్యుడు, బీజేపీ జిల్లా నాయకుడు బైండ్ల కుమార్ పిలుపునిచ్చారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అంబేద్కర్ కాలనీ ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ పిల్లలకు ప్రతి విడతలోనూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.ఒకప్పుడు దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పోలియో వ్యాధిని పల్స్ పోలియో కార్యక్రమాల ద్వారా సమర్థవంతంగా నియంత్రించగలిగామని, ఆ విజయాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో విడతలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ మళ్లీ చుక్కలు వేయించడం పూర్తిగా సురక్షితమే కాకుండా, వారి రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ వార్డు కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు