ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు పట్టణములో 1993 సంవత్సరం విద్యార్థులు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థి, ఎల్ఎల్బి మిత్రుడు గోకుల్ నగర్ నివాసి యాదయ్య యాదవ్ కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందడం పట్ల వారి బ్యాచ్ మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాదయ్య యాదవ్ కుమార్తె ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. అయితే, తండ్రి మరణంతో ఆమె కాలేజీ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మిత్రుల దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో, ఆమె విద్యాభ్యాసానికి ఎటువంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో 1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా ఒకటై మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ కలిసి రూ. 80,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ... ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతని, ఈ ఆర్థిక సహాయం ద్వారా ఆమె చదువు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యాదయ్య యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1993 బ్యాచ్కు చెందిన పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు