ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ, ప్రకృతి సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం సమాజానికి సానుకూల సంకేతమని బీరంగూడ గుట్టలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థ వెల్స్ ఫార్గో దేవాలయ ప్రాంగణంలో 5,200 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి దేవనాదం సమక్షంలో వెల్స్ ఫార్గో ప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ఆలయ పరిసరాలను పచ్చదనంతో నింపే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. దేవాలయం తరఫున నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి పెద్ద వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, మరిన్ని సంస్థలు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సభ్యులు, ఆలయ అర్చకులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, వెల్స్ ఫార్గో సంస్థ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను హరితవనంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.
Admin
ప్రజా పిలుపు