ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం చేతులు కట్టేసిన స్థితిలో ఉండటంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తోంది. గురువారం రాత్రి సమయంలో ఆమె ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించినట్లు కొందరు స్థానికులు తెలిపారు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు మృతి చెందిన మహిళ వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.మహిళ మృతికి గల కారణాలు, హత్య జరిగిందా లేదా అనే అంశాలు పోలీసుల దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. స్థానికులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Admin
ప్రజా పిలుపు