ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని చెట్ల ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతురాలిని సదాశివపేటకు చెందిన 40 ఏళ్ల మంజులగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పటాన్చెరు పరిధిలోని అంబేద్కర్నగర్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలి తలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను సంఘటన స్థలానికి తీసుకువచ్చి ఇనుపరాడ్లు, కట్టెలతో తలపై దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
Admin
ప్రజా పిలుపు