ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నా, కొత్తగా అర్హత పొందిన వేలాది మంది నిరుపేదలకు ఇప్పటికీ సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు కాకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. కనీసం కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"లో కొత్త పింఛన్ల మంజూరును ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తామని ప్రకటించారని, అనంతరం సంబంధిత మంత్రి జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని వెల్లడించినప్పటికీ, జూలై నెల ప్రారంభమైనా అమలుపై స్పష్టత కనిపించడం లేదని అన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా సమర్పించిన వేలాది దరఖాస్తులు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర సామాజిక భద్రత అవసరమైన లబ్ధిదారులు తీవ్ర నిరీక్షణలో ఉన్నారని తెలిపారు.రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్లో ఉన్న అర్హులైన దరఖాస్తులను పరిశీలించి, కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పెంపు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కనీసం కొత్తగా అర్హత పొందిన వారికి ఆలస్యం లేకుండా పింఛన్లు మంజూరు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.
Admin
ప్రజా పిలుపు