ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్లో నిర్వహించనున్న ఛలో యువ సంగ్రామ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది యువత హాజరుకానున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు వివరాలను వెల్లడించారు.గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిరుద్యోగ డిక్లరేషన్లో యువతకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాల భర్తీ, యువజన సంక్షేమం, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాల్లో హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందని, నిరుద్యోగ యువత, రైతులు, మహిళలను మోసం చేసిందని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే యువ సంగ్రామ సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, డివిజన్లు, గ్రామాల నుంచి ఐదు వేల మంది యువత సదస్సుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన ప్రతి ఓటరిని కలిసి దరఖాస్తులు నింపేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పటాన్చెరు అభివృద్ధికి ఓటు హక్కు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Admin
ప్రజా పిలుపు