ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్ బీరంగూడలోని లక్ష్మీసాయి మిడోస్ కాలనీలో వెలసిన శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ పుణ్యకార్యానికి అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శశిధర్ రెడ్డి, వారి సతీమణి లావణ్య దాతలుగా వ్యవహరించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద సేవను అందిస్తూ తమ భక్తిశ్రద్ధను చాటుకున్నారు. ఈ పవిత్ర మహోత్సవంలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే శివాలయం చైర్మన్ సుధాకర్, ప్రముఖ నాయకులు దండు రమేష్, మహేష్, మున్న విజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మల్లేష్, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలకు, ముఖ్య అతిథులకు, కాలనీవాసులకు, భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరి సేవాభావం అభినందనీయమని కొనియాడారు.అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శశిధర్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ పోచమ్మ అమ్మవారిని ప్రార్థించారు.ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు, భక్తులకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Admin
ప్రజా పిలుపు