ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీలను పార్టీకి చెందిన వారే చింపివేశారంటూ ఆరోపణలు రావడంతో స్థానిక నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రామచంద్రాపురంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమానికి మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి కన్వెన్షన్ హాల్ ముఖద్వారం వద్ద స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమానికి ముందు వాటిలో కొన్ని చించివేయబడినట్లు తెలిసింది.ఈ ఘటనపై ఒక వర్గం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పార్టీకి చెందిన వారే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.మరోవైపు, ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పార్టీ ప్రోటోకాల్ పాటించలేదని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కూడా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.పార్టీలో సమన్వయం లోపించడం, వర్గ విభేదాలు పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి స్పందిస్తూ, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న తన ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చింపివేశారని ఆరోపించారు.రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Admin
ప్రజా పిలుపు