ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరిట రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి ఓ దంపతులు రాత్రికి రాత్రే పరారైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష దంపతులు అమీన్పూర్లోని బీఎస్ఆర్ కాలనీలో గత 20 ఏళ్లుగా నివాసముంటున్నారు.స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న వీరు, ప్రతి నెలా పెద్ద మొత్తంలో చిట్టీల వసూళ్లు ప్రారంభించారు.ప్రారంభంలో క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడంతో కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వీరి వద్ద లక్షలాది రూపాయలు చిట్టీల రూపంలో జమ చేశారు.ఇటీవల చిట్టీల గడువు ముగిసి డబ్బులు చెల్లించాల్సి రావడంతో, రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు.అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా, దంపతులు తమ సొంత ఇంటిని విక్రయించి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఊరు విడిచి పారిపోయినట్లు తెలిసింది. సుమారు 20 మందికి పైగా బాధితుల నుంచి రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న దంపతుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Admin
ప్రజా పిలుపు