ప్రజా పిలుపు / తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదివారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పోలియో వ్యాక్సిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు 41,147 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు 393 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా రెండు రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ వ్యాక్సిన్ను ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఎంహెచ్ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్ర బాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు