ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గంలోని బానూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇటీవల మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బానూరు గ్రామ 8వ వార్డు సభ్యురాలు కుమ్మరి ప్రవల్లిక నరేందర్, కుమ్మరి రమ్య విద్యాసాగర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బానూరు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధులన్నీ గులాబీ జెండాలతో కళకళలాడగా, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీకి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కుమ్మరి ప్రవల్లిక నరేందర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఎలాంటి గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కొద్దిమంది నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడం, అభివృద్ధిని విస్మరించడం వల్ల కాంగ్రెస్పై తీవ్ర విరక్తి కలిగిందన్నారు. అందుకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బానూరు గ్రామ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు. దీనికి భిన్నంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని, గ్రామాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని పేర్కొన్నారు.రాబోయే స్థానిక, సాధారణ ఎన్నికల్లో బానూరు గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమని, ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి తమ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నాగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం తదితరులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు