ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరులోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివి 500 మార్కులకు పైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకం అందజేశారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తన సొంత నిధులతో ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి 21 మంది, బాలుర ఉన్నత పాఠశాల నుంచి 9 మంది, మొత్తం 30 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించారు.ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎంకేవై ఫౌండేషన్ ద్వారా మెట్టు కుమార్ యాదవ్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేపడుతున్న సేవా కార్యక్రమం అభినందనీయమన్నారు.ఇలాంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేలా చేస్తాయని చెప్పారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థిని, విద్యార్థిని విమానంలో తిరుపతికి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తామని తెలిపారు.మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తాము అందిస్తున్న సహాయం చిన్నదే అయినప్పటికీ అది విద్యార్థులను మరింత కష్టపడి చదివేలా ప్రేరేపిస్తుందని అన్నారు.ప్రతిభావంతులైన విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి విద్యలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కాడి విజయకుమార్, బండ్లగూడ డివిజన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ఏక్తా–86 అధ్యక్షుడు జయరాం రెడ్డి, ఎంఈవో నాగేశ్వర్ నాయక్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రావు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్పందన చౌదరి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎంకేవై ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు