ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవాభావంతో ముందుకు సాగాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తాలో తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, పరిపాలనా దక్షత, ధర్మరక్షణ, మహిళల గౌరవ పరిరక్షణ వంటి గొప్ప ఆదర్శాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తన సొంత నిధులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పే కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఆల్విన్ కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాబోయే మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, శివాజీ అభిమానులు, యువకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విగ్రహ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు