ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమ ఫారాలను సమర్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 78 శాతం పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆగస్టు 10 లోపు తమ ఫారాలను సంబంధిత బీఎల్వోలకు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు.అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 10 నాటికి పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17, 2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు ఓటర్లు క్లెయిమ్స్, అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు.స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు పరిష్కార ప్రక్రియ చేపట్టనున్నట్లు, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందని వెల్లడించారు.జిల్లాలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో ఉండాలన్నారు.బీఎల్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
Admin
ప్రజా పిలుపు