ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) వరంగా మారిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అమీన్పూర్ డివిజన్కు చెందిన కూరపాటి రేణుక అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం రూ.2.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి)ను మంజూరు చేసింది. మంజూరైన ఎల్ఓసిని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసిలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పూర్తిస్థాయి పారదర్శకతతో లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలు తమ కార్యాలయాన్ని సంప్రదించి సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు