ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, సుభిక్షంతో జీవించాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం వరుణ జపం, వరుణ హోమం, వరుణ యాగం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.ఆలయ కార్యనిర్వహణాధికారి దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ప్రహ్లాద్తో పాటు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.యాగంలో భాగంగా 108 పవిత్ర కలశాలను ప్రతిష్ఠించి వరుణ జపం, వరుణ హోమం, రుద్రాభిషేకాలు, కలశాభిషేకాలు నిర్వహించారు.అనంతరం పూర్ణాహుతి నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఈఓ దేవనాదం మాట్లాడుతూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బీరంగూడ గుట్ట దేవాలయంలో వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. ప్రకృతి సమతుల్యత నెలకొని రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సంకల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, చారిత్రాత్మక బీరంగూడ గుట్ట పుణ్యక్షేత్రంలో స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆనందంగా జీవించాలని, ప్రజలందరికీ శాంతి, ఐశ్వర్యాలు కలగాలని సంకల్పించి వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడిపై స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు