ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది.భక్తుల దాహార్తి తీర్చేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జల ప్రసాదం పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ కేంద్రం వినియోగంలో లేకపోవడంతో భక్తులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుండటంతో జల ప్రసాదం కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి, స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేలా సంబంధిత అధికారులు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు