ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : పటాన్చెరు, శనివారం: భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు శనివారం హైదరాబాద్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు ప్రవళిక నరేందర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాగర్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమ్మరి శివయ్య తదితరులు తమ అనుచరులతో కలిసి చేరారు.ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వం, హరీష్ రావు నేతృత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అసంతృప్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని పాలనను కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.భానూరు గ్రామంలో ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
ప్రజా పిలుపు